బంగ్లా క్రికెట్‌లో సంక్షోభం.. ప్రభుత్వ చర్యలతో ఐసీసీ దృష్టికి వివాదం!

  • బోర్డు ఎన్నికలపై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏర్పాటు
  • ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన బీసీబీ
  • ఇది బోర్డు స్వయంప్రతిపత్తికి విఘాతమని ఆరోపణ
  • బయటి జోక్యంపై ఐసీసీ చర్యలు తీసుకునే ప్రమాదమని హెచ్చరిక
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), ఆ దేశ ప్రభుత్వం మధ్య కొత్త వివాదం రాజుకుంది. గ‌తేడాది అక్టోబర్ లో జరిగిన‌ బీసీబీ ఎన్నికల ప్రక్రియపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయడంపై బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య తమ స్వయంప్రతిపత్తికి, స్థిరత్వానికి భంగం కలిగించేలా ఉందని ఆరోపించింది.

ఈ మేరకు బీసీబీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఇటీవల ఒక గెజిట్ జారీ చేసి, ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు విచారణ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపింది. తాము రాజ్యాంగబద్ధంగా, నిబంధనల ప్రకారం ఎన్నికైన పాలకవర్గమని, తమ కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయం బోర్డు కార్యకలాపాల్లో అనిశ్చితిని సృష్టిస్తుందని పేర్కొంది.

ఈ వ్యవహారం ఐసీసీ నిబంధనలకు విరుద్ధమని బీసీబీ హెచ్చరించింది. ఎన్నికైన క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని ఐసీసీ తీవ్రంగా పరిగణిస్తుందని గుర్తు చేసింది. ఇప్పటికే ఈ అంశంపై ఐసీసీ ఉన్నతాధికారులతో అనధికారికంగా చర్చలు జరిపామని, వారు కూడా పాలనాపరమైన సమస్యలు తలెత్తవచ్చని సూచించినట్లు బీసీబీ వెల్లడించింది.

అయితే, ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసే ముందు ఈ విషయంపై నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్‌తో చర్చించి స్పష్టత కోరతామని బీసీబీ తెలిపింది. అంతర్జాతీయ క్రికెట్ సమాజంలో దేశ ప్రతిష్ఠ‌ను కాపాడేలా, బోర్డు స్వయంప్రతిపత్తికి భంగం వాటిల్లకుండా ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరింది.

BCB
Bangladesh Cricket Board
Bangladesh cricket
ICC
International Cricket Council
Bangladesh government
National Sports Council
cricket board election
cricket governance
cricket controversy

More Telugu News